ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని బీజేపీ ఓర్వలేకపోతున్నాదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆకర్షిస్తున్న నేపథ్యంలో తమ పార్టీ చేతగాని తనం బయటపడుతుందనే అక్కసుతో అనేక కుట్రలకు బీజేపీ పాల్పడుతూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను వేధిస్తున్నదని ఆరోపించారు.
ఇప్పటికే మన పార్టీ మంత్రులు, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో తప్పుడు ఆరోపణలు వేధిస్తున్నదని బీజేపీ వేధింపులను ఎంత వరకైనా తిప్పికొడతామనీ, ఎదుర్కొంటామని పేర్కొన్నారు. గంగుల కమలాకర్, రవిచంద్ర ఇప్పుడు కవిత వరకూ వచ్చారన్న కేసిఆర్.. ఎంత మంచి పని చేసినా బద్నాం చేస్తారని తెలిపారు. ప్రజల కోసం కడుపుకట్టుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారని కవితను కూడా పార్టీలో చేరమని వత్తిడి తెచ్చారని అన్నారు. మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారంటూ కేసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ దేశం నుండి బీజేపీని పారద్రోలే వరకూ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో ముందస్తు ఎన్నికలపైనా క్లారిటీ ఇచ్చారు కేసిఆర్. ముందస్తు ఎన్నికలు ఉండవని నేతలకు తేల్చి చెప్పారు కేసిఆర్. షెడ్యుల్ ప్రకారమే డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగుతాయని కేసిఆర్ నేతలకు మరో సారి తెలిపారు. అయితే ఈ ఎనిమిది నెలలు ప్రజల్లోనే ఉండాలని నేతలను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలన్నారు. అలానే నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహించుకుని నేతల మధ్య విభేదాలుంటే పరిష్కరించుకోవాలని సూచించారు. విభేదాలు ముదరకుండా పార్టీ నేతలను అందరినీ కలుపుకుని వెళ్లేలా వ్యవహరించాలని ఆదేశించారు. ఐక్యంగా ఎన్నికలకు వెళితేనే గెలుపు సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. నేతలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు కూడా చేస్తే మంచిదని కేసిఆర్ తెలిపారు.
తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి స్వల్ప ఊరట ..హైకోర్టు కీలక ఆదేశాలు