తెలంగాణ సీఎం కేసిఆర్ సమీప బంధువైన మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్. ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ వ్యవహారం కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురిని వికారాబాద్లో క్షేమంగా ఉండటాన్ని గుర్తించిన పోలీసులు వారిని సికిందరాబాద్లోని ఇంటికి తీసుకువచ్చారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారు ఇచ్చిన సమాచారంతో మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హఫీజ్పేటలోని రూ.100 కోట్ల విలువైన భూమిపై కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ గొడవల నేపథ్యంలోనే వీరిని కిడ్నాప్ చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్లు భావిస్తున్నారు.
నిన్న రాత్రి సికిందరాబాద్ బోయిన్ పల్లి మనోవికాస్ నగర్ లో ఉండే ప్రవీణ్ కుమార్, ఆయన సోదరులు సునీల్ రావు, నవీన్ రావు ఇంటికి దుండగులు ఐటి అధికారుల మంటూ వెళ్లి ఇంట్లోని ల్యాప్ టాప్, ఫోన్ లతో పాటు వారి ముగ్గురిని బలవంతంగా కారులో తీసుకువెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులు అధికారులతో సంప్రదింపులు జరపగా ఐటి అధికారులు ఎవరూ దాడికి రాలేదని తెలిసింది. రాయలసీమకు చెందిన ముఠా సభ్యులే ఈ కిడ్నాప్ చేశారని ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీపీ అంజనీకుమార్ వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవితలు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కిడ్నాప్ కు సంబంధించి నిందితుల అరెస్టు వివరాలను నేడు పోలీసు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.