తెలంగాణ కాంగ్రెస్…. ముఖ్యమంత్రి కేసీఆర్కు సరైన ప్రతిపక్షం అని నిరూపించుకునేందుకు గత కొద్దికాలంగా ప్రయత్నిస్తోంది. వివిధ కార్యక్రమాలు చేపడుతోంది.
ఇక కొత్త ఇంచార్జీగా మాణికం ఠాగూర్ వచ్చిన తర్వాత జోరందుకున్నాయి. మైదరాబాద్తో పాటుగా వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, ఇందులో పలు చిత్రమైన పరిణామాలు చోటు చేసకుంటున్నాయి.
జగ్గారెడ్డి నుంచి మొదలైంది
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఇన్ఛార్జ్ ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్లకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. క్రేన్ సహాయంతో పూల దండలు వేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జీ మాణికం ఠాగూర్. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జగ్గారెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇక్కడి నుండి నామినేషన్ వేసిన చోటు… అందుకే ఇక్కడి నుండి తాను ఇంఛార్జిగా కార్యక్రమాలు మొదలు పెట్టానని వివరించారు.
కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు….
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జీ ఫైర్ అయ్యారు. తెలంగాణలో అన్ని వర్గాలు మేలు జరగాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు..కానీ ఆమె కల నెరవేరలేదని తెలిపారు. తెలంగాణలో ప్రతీ పౌరుడికి సాధికారత కావాలని సోనియాగాంధీ కోరుకున్నారు కానీ కేసీఆర్.. ఆయన కొడుకు..అల్లుడు.. బిడ్డ చేతిలోనే అధికారం ఉండిపోయిందని మాణికం ఠాగూర్ మండిపడ్డారు. ఏమీ లేని స్థితి నుండి… కేసీఆర్ అత్యంత ధనికుడు అయ్యారని.. కేసీఆర్.. త్వరలో ముఖేష్ అంబానీ కంటే ధనవంతుడు అయిపోతారని పేర్కొన్నారు. ముఖేష్ వ్యాపారం చేస్తున్నాడు… కేసీఆర్ కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. కేసీఆర్ ని కమీషన్ చంద్రశేఖర్ అని పిలుద్దామని తెలిపారు.
అధికారంలోకి రావాల్సిందే
2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలని తనను ఇక్కడికి పంపించారని మణికం ఠాగూర్ తెలిపారు. విజన్ 2023 పేరుతో మనం ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 79 స్థానాలు కాంగ్రెస్ గెలవాలన్నారు. నష్టపోయిన అన్ని వర్గాలు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా ముందుకు పోతే ఎవరినైనా ఓడించగలమని, కేసీఆర్ ని ఓడగొట్టడం పెద్ద లెక్కకాదని అన్నారు.
అప్పుడే మంత్రి పదవులు
తెలంగాణ ఇంచార్జ్ ఠాగూర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డికి వచ్చే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా జగ్గారెడ్డి మంత్రి అవుతారని అన్నారు. అయితే, ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లడుతూ ఆంధోల్ కార్యకర్తలు ఆందోళన చెందకండి, ఇంఛార్జి నాకు మంత్రి పదవి అన్నారని కన్ఫ్యూజ్ కాకండి, ముందు దామోదర రాజనర్సింహ .. అనంతరమే తనకు మంత్రి పదవి అని చెప్పుకొచ్చారు.
మంత్రి పదవులు ఇచ్చేస్తాం…
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పదిలో ఐదు మంత్రి పదవులు ఇక్కడికే ఇస్తాంలే జగ్గన్నా అని చెప్పుకొచ్చారు. 2023 లో కాదు..2022 లొనే ఎన్నికలన్న ఉత్తమ్, కేసీఆర్ ఐదేళ్లు పాలన చేయలేడని, ఎన్నికలు 2022 లొనే.. అందుకు అందరూ సిద్ధం అవ్వండని కోరారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు ఉత్తమ్ కుమార్రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మోడీ, కేసీఆర్ తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అయితే, ఆలూ లేదు చూలు లేదన్నట్లు ఇప్పుడే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల గురించి చర్చించుకుంటున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.