రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు. ఈ నెల 21న తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో శ్రావణ్ బీజేపీ లో చేరతారని భావించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దాసోజు శ్రావణ్ నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా దాసోజు శ్రావణ్ తెలిపారు.
సుదీర్ఘ కాలం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాసోజు శ్రావణ్ పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖరితాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అయితే దివంగత నాయకుడు పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన రెండు మూడు రోజుల్లోనే శ్రావణ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం గమనార్హం. శ్రావణ్ కుమార్ పార్టీ విడకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ మెత్తబడలేదు. రేవంత్ రెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేసి పార్టీని వీడారు.
21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు