కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడిన రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తమను రెచ్చగొట్టవద్దంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ రాజగోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు. సొంత సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరుతుండటంతో కాంగ్రెస్ ఎంపిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆ ప్రభావం పడుతుందని, పార్టీలో ఇంతకు ముందు ఉన్న ప్రాధాన్యత ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే… రాజగోపాల్ రెడ్డిపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి తనకు పీసీసీ పదవి ఇవ్వాలని అడిగారనీ, తన అన్న వెంకటరెడ్డికి ఇవ్వొద్దని అప్పట్లో చెప్పాడన్నారు షబ్బీర్ ఆలీ. ఒక రోజు రాజగోపాల్ రెడ్డి తన ఇంటికి వచ్చారనీ, పీసీసీ పదవికి ప్రపోజ్ చేయాలని తనను అడిగారని షబ్బీర్ తెలిపారు. ఇది నిజమా .. కాదో ఒట్టేసి చెప్పాలని షబ్బీర్ ఆలీ సవాల్ విసిరారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడిచారని షబ్బీర్ ఆలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో కాంట్రాక్ట్ లు చేసిన రాజగోపాల్ రెడ్డికి కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయనీ, ఆయన డిఫాల్టర్ గా మారారని, ఆ సమస్య నుండి బయటపడేందుకే అమిత్ షా ను కలిశారని షబ్బీర్ ఆరోపించారు.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఏ రోజైనా మునుగోడు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ ను విమర్శించే స్థాయి రాజగోపాల్ రెడ్డికి లేదని అన్నారు షబ్బీర్ ఆలీ. ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తి కింద 20ఏళ్లకు పైగా పార్టీలో ఉన్న తాము పని చేయాలా అంటూ రాజగోపాల్ రెడ్డి .. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనేక తప్పలు చేసిందని విమర్శలు చేసిన నేపథ్యంలో షబ్బీర్ ఆలీ ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.