తెలంగాణ ఫెర్ బ్రాండ్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసంతృప్తితో ఉన్నారా? పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నారా? సొంత పార్టీ బీజేపీ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అందుకు తగినట్లు ఇటీవల జరిగిన పరిణామాలు, కారణాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్గా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన విజయశాంతి బీజేపీలో చేరేందుకు మూహూర్తం ఫిక్స్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ఆమెతో చర్చించారు. విజయశాంతి పార్టీ మారనున్నారు అంటూ వస్తున్న వార్తలపై ఆమె ఖండించడం గానీ, క్లారిటీ ఇవ్వడం గానీ చేయలేదు. అయితే దీనిపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపి మధు యాష్కీ స్పందిస్తూ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో లేరనీ, కేవలం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపైనే అసంతృప్తితో ఉన్నారనీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అంటే ఆమెకు ఎంతో అభిమానమని, పార్టీ మారరు అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మధుయాష్కీ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లుగా నిన్న విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు ఛానల్స్ లో లీకేజీల ద్వారా తనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా నేడు విజయశాంతి సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేయి దాటిపోయింది అన్నట్లుగా విజయశాంతి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసిఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించింది. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి..ఇంకొందరిని భయపెట్టి..ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు. కాంగ్రెస్ ను బలహీనపర్చే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజెపీ తెలంగాణలో సవాల్ విసిరే స్థాయికి వచ్చింది. మరి కొంత ముందుగానే మాణిక్యం ఠాగూర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము. ప్రజలే నిర్ణయించాలి”అని విజయశాంతి పేర్కొన్నారు.
చాలా కాలం నుండి విజయశాంతి ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సందర్భాలలో ఇంతకు ముందు తన పేరు పక్కన పిసిసి ప్రచార కమిటీ చైర్ పర్సన్ అని రాసుకునే వారు. అయితే రెండు రోజుల క్రితం పోస్టులలో తన పేరు పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు రాసుకున్నారు. నేడు మాత్రం తన పేరు పక్కన పార్టీ పేరు రాసుకోలేదు. ఇవన్నీ గమనిస్తుంటే పార్టీ మార్పునకు సంకేతాలేనని అని అనుకుంటున్నారు.
విజయశాంతి సినీ రంగం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది బీజేపీతోనే . భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా పని చేశారు. ఆ తరవాత బీజెపీ నుండి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తరువాత ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి ఎంపిగా గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్తో విబేధాలు రావడంతో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరగా పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే గత కొద్ది నెలల నుండి కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదని, ప్రాధాన్యత ఇవ్వడం లేదని సమాచారం. కొద్ది రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.