Telangana Congress : తెలంగాణ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో మారు కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ గతంలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వేళ రాజగోపాలరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ను ఓడించే శక్తి బీజేపీకే ఉందని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ప్రజలు బీజెపీవైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
బీజెపీ నుండి తనకు ఆహ్వానాలు వస్తూనే ఉన్నాయనీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా బీజేపీ కోరుతోందని కూడా చెప్పుకొచ్చారు. తాను ఒక వేళ బీజేపీకి వెళ్లి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి మూడవ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ గద్దె దించడమే తన లక్ష్యమని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. స్వార్థ ప్రయోజనాలకు తాను పార్టీ మారననీ, ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం చూస్తే కాంగ్రెస్ పార్టీని వీడి బీజెపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే మాటలు వినబడుతున్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి సిద్ధం లేరని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజకీయ ప్రయాణంపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని, రాబోయే ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా దూసుకువెళ్లేందుకు బీజేపీ..ఆటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి వాదులను, సీనియర్లను చేసుకుని బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే వివిధ పార్టీల నుండి జాయిన్ అయ్యే నాయకులకు కండువాలు కప్పేస్తుంది బీజేపీ.