తెలంగాణకు కొత్తగా ఇన్ చార్జ్ వచ్చారు తెలుసు కదా. ఆయన పేరు మాణికం ఠాగూర్. ఆయనది తమిళనాడు. ఆయన తెలంగాణకు వచ్చినప్పటి నుంచి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రావడం రావడమే తెలంగాణలో సంచలనాలను తెర తీస్తున్నారు. తెలంగాణను ఇచ్చింది సోనియమ్మేనన్న నినాదాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తన పార్టీ నాయకులకు సూచిస్తున్నారు.
అంతే కాదు.. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 79 సీట్లను సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారం. అందులో డౌటే లేదు. ఈసారి మా నుంచి పెద్దగా హడావుడి ఉండదు. అభ్యర్థుల ఎంపిక కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. పార్టీ పట్ల అంకిత భావం ఉన్నవారికే పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తాం.. అని ఠాగూర్ అన్నారు.
అయితే.. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం కోసం సమాయత్తం అవుతోందంటే.. వామ్మో కాంగ్రెస్ దూకుడు బాగానే పెంచిందిగా.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి కొత్త ఇన్ చార్జ్ వచ్చాక తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చినట్టు కనిపిస్తున్నా.. అది ఎన్నికల వరకు ఉంటుందా? లేదా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.