(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
కొత్త సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కొత్త సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు గానూ ఆర్ అండ్ బి శాఖ టెండర్లు పిలిచింది. కొత్త సచివాలయ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త సచివాలయ భవన నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టులోనూ సవాల్ చేశారు. మరో పక్క జాతీయ హరిత ట్రిబ్యునల్ ( ఏన్ జి టి)కి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఇది ఇలా ఉండగానే ఆర్ అండ్ బి అధికారులు టెండర్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 18 నుండి అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకూ టెండర్లు స్వీకరిస్తారు. ఈ నెల 26న ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీన సాయంత్రం నాలుగన్నర గంటలకు టెక్నికల్ బిడ్స్ వేస్తారు. అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రమంజిల్ అర్ అండ్ బి ఈఎన్ సి కార్యాలయంలో ప్రైస్ బిడ్స్ వేస్తారు.
కాగా ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఎన్ జి టి బృందాన్ని నేరుగా రేవంత్ రెడ్డి కలిసి తన ఫిర్యాదులోని అంశాలను వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం చేపడుతున్నారని ఆయన వివరించారు.