తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ హోం పేషెంట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వారి కోసం ఓ నూతన యాప్ను అందుబాటులోకి తేనుంది. హోం ఐసొలేషన్లో ఉండి కోవిడ్ చికిత్స తీసుకుంటున్నవారికి ఆ యాప్ ఉపయోగపడుతుంది. అందులో డాక్టర్లను, పేషెంట్లను అనుసంధానం చేస్తారు. ఒక్కో డాక్టర్కు 50 మంది పేషెంట్లను కేటాయిస్తారు. వారు నిత్యం పేషెంట్లకు కాల్స్ చేస్తూ వారి పరిస్థితిని తెలుసుకోవాలి. అవసరం అయిన సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు వారికి అవసరం అయితే డాక్టర్లు మందులను కూడా ఇవ్వాలి.
ఇక ఆ యాప్లో పేషెంట్లతో మాట్లాడేందుకు డాక్టర్లకు వీడియో కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రిటైర్ అయిన డాక్టర్లను నియమించుకోనుంది. ఇక ఆ యాప్ను ఐఐటీ డెవలప్ చేస్తోంది. ఆ యాప్ ద్వారా హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్లను ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మందికి పైగా పేషెంట్లు హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు. వీరందరి వివరాలను యాప్లో చేర్చి డాక్టర్లతో అనుసంధానం చేస్తారు. ఈ క్రమంలో పేషెంట్లు వైద్య సహాయం పొందడం మరింత సులభతరమవుతుంది.
అయితే ఆ యాప్ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే యాప్ను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. తాజాగా ఆయన సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఓ పకడ్బందీ ప్రణాళికతో తెలంగాణ సర్కారు కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఆ యాప్ను కూడా డెవలప్ చేస్తున్నారు.