కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా తెలుగు చలన పరిశ్రమకు సంబంధించిన సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. థియేటర్లు మూత పడ్డాయి…. అటు సగం సినిమా పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు మరియు వాటి ప్రొడ్యూసర్లు లాక్ డౌన్ వల్ల అయోమయంలో పడ్డారు.
వీటన్నింటి మధ్య సినీ ప్రముఖులు అంతా కలిసి మొన్నీమధ్యే చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
చివరికి ఎప్పుడెప్పుడా అని సినిమా ప్రేక్షకులు, సినిమా ప్రియులూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సినిమా ఇండస్ట్రి విజ్ఞప్తి మేరకు తెలంగాణా సిఎం కేసిఆర్ కీలక జీ.వో మీద సంతకం పెట్టారు. రాష్ట్రం లో సినిమా షూటింగ్ లు అనుమతిస్తూ జీ.వో విడుదల చేయనుంది తెలంగాణా సర్కార్.
మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని రేపు సినీ ప్రముఖులు కలవనుండగా తెలంగాణ సర్కార్ నుండి ఈ జీవో రావడం విశేషం. ఇప్పటికే జగన్ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ స్థలాలు సినిమా షూటింగ్ లకు ఉచితం అని ప్రకటించిన విషయం తెలిసిందే.