వ్యాపారానికే కాదు రాజకీయానికి కూడా ప్రచారం అవసరమే!ఇప్పుడు ప్రచారం అనేది అతి కాస్ట్లీవ్యవహారం.ముఖ్యంగా మీడియాలో ప్రచారం కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.
అదే పనిని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం చేసింది. అయితే ప్రజలు కట్టిన పన్నుల ద్వారా లభించిన ఆదాయాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడమే ఇక్కడ గమనార్హం.ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో దాదాపు వెయ్యి కోట్లు ప్రభుత్వ ప్రకటనల మీద ఖర్చుపెట్టినట్లు చెప్పుకుంటారు. ఇందులో చంద్రబాబునాయుడుకు అతి సన్నిహితుడైన ఒక మీడియా సంస్థకు ఏడువందల కోట్ల వరకూ చెల్లించారని అప్పట్లో వినిపించింది.రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా లేనట్టే ప్రభుత్వం అనుకుంటే ఎంతైనా ప్రకటనల మీద ఖర్చు పెట్టగలదు .తనవారికి ఇచ్చుకోగలదు.మీడియా మేనేజ్మెంట్లో నిష్ణాతుడైన చంద్రబాబు ప్రకటనల ద్వారా వారిని ఆకట్టుకున్నారు అంటే అదేమీ పెద్ద విషయంగా కనిపించట్లేదు.కానీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రకటనల విషయంలో తక్కువ తినలేదని తాజాగా వెల్లడైంది.2014-2018 సంవత్సరాల మధ్య నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు ప్రభుత్వ ప్రకటనల మీద అక్షరాలా 310 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు బయటపడింది.
తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టారట.ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారాన్ని సేకరించింది.దీంతో విస్తుపోవడం అందరి వంతయింది.వివిధ మీడియా సంస్థలకు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని కెసిఆర్ ప్రభుత్వం పువ్వుల్లో పెట్టి ఇచ్చిందని అధికారులే తమ సమాధానంలో తెలిపారు.అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో కేసీఆర్ ని చంద్రబాబుతో పోల్చి చూస్తున్నారు.పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వెయ్యికోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చుపెడితే ధనిక రాష్ట్రమైన తెలంగాణ అందులో మూడోవంతే కదా ఖర్చుపెట్టిందని సమర్థించుకుంటున్నారు.ఎవరు ఎంత ఖర్చు పెట్టారన్నది ఇక్కడ పాయింట్ కాదు.ప్రజా ధనాన్ని ఇలా పప్పుబెల్లాల్లా మీడియా సంస్థలకు పంచి పెట్టటమే ఆక్షేపణీయం.అటు తెలుగుదేశం పార్టీ కైనా ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి కైనా కోట్లరూపాయల్లో విరాళాల కింద నిధులిచ్చేవారు ఉన్నారు.అలా పార్టీలకి లభించే విరాళాలు ప్రచారానికి ఖర్చుపెట్టి ప్రభుత్వ ధనాన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకి ఉపయోగిస్తే ప్రజలు బాగుపడతారు కదా!