తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోదముద్ర వేయని నేపథ్యంలో గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా సర్కార్ హైకోర్టులో ను ఆశ్రయించింది.
లంచ్ మోషన్ పిటిషన్ కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదనీ, గవర్నర్ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ ధర్మాసనానికి వివరించగా, గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలమని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తొంది. లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏజి సమాధానం ఇవ్వడంతో అందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే పిటిషన్ రెడిగా ఉందా, సిద్దంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ధర్మాసనం ఏజీకి స్పష్టం చేసింది.
ఈ తరుణంలో అడ్వొకేట్ జనరల్ ఛాంబర్ లో గవర్నర్ తరపు న్యాయవాది అశోక్ రాంపాల్, ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వొకేట్ జనరల్ దాదాపు గంట పాటు సమావేశమై అనేక అంశాలపై చర్చించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, అధికార పక్షం నుండి గవర్నర్ ను టార్గెట్ చేస్తూ సాగుతున్న విమర్శలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ వాతావరణం ఉండకూడదనే నిర్ణయానికి వచ్చారు. వీరి మధ్య చర్చలు సఫలం అవ్వడంతో తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత ఈ విషయాలను హైకోర్టు ధృష్టికి తీసుకువెళ్లారు. లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు దుష్యంత్ దవే. గవర్నర్ తరపు న్యాయవాది తో తమకు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయనీ దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలియడంతో పాటు విమర్శలు, ప్రతి విమర్శలకు స్వస్తి పలకాలని నిర్ణయానికి రావడంతో ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య సయోధ్య కుదిరినట్లు అయ్యింది.
గవర్నర్ వర్సెస్ సర్కార్ ..తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ.. హైకోర్టును ఆశ్రయిస్తున్న సర్కార్..?