తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తనదైన శైలిలో రాజ్ భవన్ కేంద్రంగా ప్రజలకు చేరువ అవుతున్న సంగతి తెలిసిందే. పదవిలోకి నియమితులైన నాటి నుంచి ఆమె గవర్నర్ హోదాలో ప్రజలకు ఏ విధంగా మేలు చేయవచ్చో అందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, తనపై వచ్చిన కామెంట్ల విషయంలోనూ ఆమె అదే రీతిలో స్పందిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పట్ల అనుసరించిన వైఖరినే ఇప్పుడు కాంగ్రెస్ పట్ల ప్రదర్శించారు.
గవర్నర్ మేడంకు ఎందుకు కోపం వచ్చిందంటే…
దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఆందోళనకు పిలుపునిచ్చారు. రాజ్భవన్ వద్దకు చేరువ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై వారికి అపాయింట్మెంట్ నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పలు రకాల కామెంట్లు చేయడంతో గవర్నర్ మండిపడ్డారు. అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్భవన్ అడ్డా కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని…4 నెలలుగా రాజ్భవన్ ఇదే విధానాన్ని అవలంభిస్తోందని స్పష్టం చేశారు. సమస్యలుంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చుని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాజ్భవన్కు రాజకీయాలు ఆపాదించొద్దని…తాను డాటర్ ఆఫ్ తమిళనాడు..సిస్టర్ ఆఫ్ తెలంగాణ అని స్పష్టం చేశారు. త్వరలోనే తెలుగు నేర్చుకుంటానని తమిళిసై చెప్పారు.
గతంలో టీఆర్ఎస్ నేతలకు కూడా….
కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ఓ సందర్భంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదన్నగవర్నర్.. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని తెలిపారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తమిళిసై పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కరోనాను తక్కువగా అంచనా వేశారన్న ఆమె.. సీఎంకు లేఖలు రాసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.. మొదట్లో టెస్టులకు కార్పొరేట్ ఆస్పత్రులకు అనుమతి ఇవ్వక పోవడం తప్పిదమని.. తన సలహాలను సరైన స్ఫూర్తితో తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంట్రీతో…
అయితే.. ఆమె వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ తమిళిసై తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా మాట్లాడటం సరికాదన్న ఆయన.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పనితీరు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అన్నారు. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పథకాలను ప్రశంసించారని గుర్తు చేసిన సైదారెడ్డి.. గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం కరోనాటెస్ట్లు చేస్తోందని పేర్కొన్నారు. మొత్తానికి కరోనా వైరస్ ఇప్పుడు గవర్నర్ వర్సెస్ అధికార పార్టీగా మారిపోయింది. అయితే, ఈ కామెంట్లు వివాదం రూపుగా మారుతున్న తరుణంలో సైదిరెడడి తన కామెంట్లను మరో రూపంలో తీసుకోవద్దని వివరించారు. టీఆర్ఎస్ నేతలు సైతం సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ప్రజల్లో భరోసా నింపేందుకు …
ఇక కీలకమైన కరోనా విషయంలోనూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్తో చెక్పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వీటిలో దాదాపు 100 వ్యాక్సిన్లు ట్రయల్స్లో ఉన్నాయి. అయితే, 2020లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని గవర్నర్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ను సందర్శించిన ఆమె.. వ్యాక్సిన్ తయారు చేస్తున్న శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై.. వ్యాక్సిన్ తయారీ కోసం చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… శాస్త్ర వేత్తలు వ్యాక్సిన్ మీద అంత్యంత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు.. దేశంలోనే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆమె… వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపేందుకే భారత్ బయోటెక్కు వచ్చినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్ బయోటెక్ ఇతర వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా 3 మిలియన్ డోసులు సప్లై చేసిందని ఈ సందర్భంగా వెల్లడించిన గవర్నర్.. 2020 లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్నారు. తక్కువ ధరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని.. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వ్యాక్సిన్ తయారు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. మొత్తంగా గవర్నర్ అంటే రాజ్భవన్కు మాత్రమే పరిమితం అయిపోయే వ్యక్తి కాదని గవర్నర్ నిరూపిస్తున్నారు.