Telangana Govt: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ఇరుగు పొరుగు రాష్ట్రాలు విబేధాలను విడనాడి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సింది పోయి ప్రజలకు ఇబ్బందులు కల్గించే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఓ ఆకస్మిక నిర్ణయం కరోనా బాధితులకు శాపంగా మారింది. ఏపి నుండి తెలంగాణకు అంబులెన్స్ లో వెళ్లే కోవిడ్ రోగులను రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు చేసి వెనక్కు పంపుతున్నారు.
సాధారణంగా అంబులెన్స్ వెళ్లే రోగుల పట్ల మానవత్వంతో చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి పోలీసు అధికారులు పాటించాల్సిన అవసరం ఉంది. ఏపి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏపిలోని చాలా ప్రాంతాల్లో తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉంటుండగా వారి పిల్లలు ఉద్యోగ, వ్యాపార రీత్యా తెలంగాణలో స్థిరపడిన వారు ఎందరో ఉన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చాలా మంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళుతుంటారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది.
ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగా తెలియజేయకపోవడంతో కరోనాతో బాధపడుతున్న రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ అంబులెన్స్ మాట్లాడుకుని ఏపి నుండి హైదరాబాదుకు వెళుతున్న కరోనా రోగులను విజయవాడ – హైదరాబాదు జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దు రామాపురం అడ్డ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేసి అనుమతి లేదంటూ వెనక్కు పంపిస్తున్నారు. ఇంతకు ముందు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన సమయంలో ఫ్లైట్ లో హైదరాబాదుకు వెళ్లి చికిత్స చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకువడాన్ని కరోనా బాధితుల బంధువులు తప్పుబడుతున్నారు. ఈ పరిస్థితిపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలంగాణ సీఎం కేసిఆర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?