టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. రూ.3లక్షల సొంత పూచికత్తుతో పాటు రెండు షూరిటీలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి సోమవారం నిందితులు సిట్ అధికారి ఎదుట విచారణకు హజరు కావాలని, పాస్ పోర్టులను దర్యాప్తు అధికారి వద్ద డిపాజిట్ చేయాలని ధర్మాసనం షరతులు విధించింది.
నిందితుల బెయిల్ పిటిషన్ ఇవేళ హైకోర్టులో వాదనలు జరిగాయి. నిందితులు నెల రోజుల పాటు జైల్లో ఉన్నారని, సుప్రీం కోర్టు సైతం బెయిల్ ఇవ్వొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని వారి తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. 41 ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయడాన్ని సుప్రీం కోర్టు సైతం తప్పుపట్టినట్లు నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. మరో పక్క నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పోలీసులు తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సిట్ దర్యాప్తు కీలకదశలో ఉందనీ, ఈ తరుణంలో బెయిల్ మంజూరు చేయవద్దని ధర్మాసనాన్ని కోరారు. అయితే నిందితుల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే ఈ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు అయినప్పటికీ సింహయాజీ మినహా ఇతర నిందితులు రామచంద్రభారతి, నంద కుమార్ లపై వేరు వేరు కేసులు ఉండటంతో వారి విడుదల ఇప్పట్లో కుదరకపోవచ్చు. నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయిదు కేసులు నమోదు అయ్యాయి. దక్కన్ కిచెన్ లీజ్ వివాదానికి సంబంధించి వేరువేరుగా అయిదు కేసులు నమోదు కాగా లీజ్ కేసు విషయంలో పోలీసులు నందకుమార్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో కూడా బెయిల్ మంజూరు అయితే ఆయన జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెెండు కేసులు నమోదు అయ్యాయి. నకిలీ పాస్ పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కల్గి ఉన్నారని రెండు వేరువేరు కేసులు నమోదు చేశారు. రామచంద్రభారతి బెయిల్ పై బయటకు రాగానే బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చూపే అవకాశం ఉంది.