హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాల విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హై కోర్ట్ కొట్టి వేసింది.
ఎన్నికల సమయంలో ఈ రెండు సినిమాలను విడుదల చేయొద్దంటూ సత్యనారాయణ అనే వ్యక్తి హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.
వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందనీ, సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేసింది.
ఈ రెండు సినిమాల్లో ఏమైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే చర్య తీసుకుల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదల చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. దీంతో సినిమా విడుదలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించగా, ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ చిత్రాన్ని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి రూపొందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ను ముందుగా ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఆ సినిమా విడుదల వాయిదా పడింది. మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.