కేసిఆర్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల తర్వాత సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ను హైకోర్టు రద్దు చేసింది. సిట్ దర్యాప్తు కూడా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ రోజు ఉదయం నుండి ఈ కేసు విచారణపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ జరుపుతోంది. ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో విచారణను తిరిగి మొదటి నుండి విచారించే అవకాశం ఉంది. మరో పక్క హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నకు కొందరు మథ్యవర్తులు బేరసారాలు జరుపుతున్న నేపథ్యంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ముందుగా అక్కడ సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు .. మధ్యవర్తులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారాావులతో మాట్లాడుతుండగా పట్టుకున్నారు. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికి రూ.100 కోట్లు చొప్పున ఇస్తామనీ, దాంతో పాటు కాంట్రాక్ట్ లు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురి చేసేందుకు ప్రయత్నించారు.
ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై ముందుగానే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమాచారం ఇవ్వడంతో పక్కా ప్రణాళిక ప్రకారం వలపన్ని ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు నాడు పోలీసు అధికారుుల వెల్లడించారు. ఇక్కడ జరిగిన తతంగంపై ముఖ్యమంత్రి కేసిఆర్ మీడియా సమావేశంలో ప్రస్తావించి కేంద్రంలోని బీజేపీపై నిప్పులు చెరిగారు. పలు వీడియోలను, మద్య వర్తుల సంభాషణలను మీడియా సమావేశంలో చూపారు కేసిఆర్. ఏకంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. అయితే తొలి నుండి సిట్ దర్యాాప్తును బీజేపీ వ్యతిరేకించింది. పిటిషన్ల వాదనకు ఏకీభవించిన హైకోర్టు .. కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే తీర్పు వెలువడిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చే వరకూ ..ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్ లో ఉంటాలని, తీర్పును అమలు చేయవద్దని సిట్ తరపున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అప్పీల్ కు వెళ్తామని ధర్మాసనానికి సిట్ తరపున ఏజీ తెలిపారు., దీంతో అప్పీల్ కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి తెలిపారు. తక్షణమే సీబీఐకి అప్పగించాలని కోర్టు తెలిపినప్పటికీ ఏజీ అభ్యర్ధనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాతే సిట్ అప్పీల్ కు వెళ్లనుంది. ఈ పరిణామంతో డివిజన్ బెంచ్ తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాాయి. మరో పక్క హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?