టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సిట్ నోటీసులకు జారీ చేసినా విచారణ హజరుకాకపోవడంతో ఆయన (సంతోష్) ను అరెస్టు చేయవద్దు అన్న ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వ న్యాయవాది ఇటీవల హైకోర్టుకు కోరారు. ఇందుకు హైకోర్టు తిరస్కరిస్తూ మళ్లీ 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనకు మరో మారు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేస్తూ, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బీఎల్ సంతోష్ ఇవేళ తెలంగాణ హైకోర్టును క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వమే జోక్యం చేసుకుంటోందని బీఎల్ సంతోష్ తరపున సీనియర్ కౌన్సిల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో బీఎల్ సంతోష్ నిందితుడు కాదు, అనుమానితుడు కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శకంగా విచారిస్తుందన్న నమ్మకం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు, కేసుల పేరుతో వేధిస్తొందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయ దురుద్దేశం ఉందని, కేసును క్వాష్ చేయాలని వాదించారు.
బీఎల్ సంతోష్ పై నమోదైన కేసులు, నోటీసులను నిలిపివేయాలని కోరారు. ఎఫ్ఐఆర్ లో బీఎల్ సంతోష్ పేరు లేదనీ, ఇప్పుడు ఎలా నిందితుడుగా చేరుస్తారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. అయితే బీఎల్ సంతోష్ పై పక్కా ఆధారాలు ఉన్నాయనీ ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. 41 సీఆర్పీసీని అనుసరించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. 41 సీఆర్పీసీ నోటీసులపై స్టే విధిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ అరెస్టుపై హైకోర్టు ఏమన్నదంటే..?