TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని, తమ నివాస ప్రాంత వివరాలను పోలీసులకు అందజేయాలని ఆదేశించింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బేరసారాలు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా గురువారం రాత్రి మెజిస్ట్రేట్ నిబంధనలు పాటించలేదన్న కారణంతో వారి రిమాండ్ రిపోర్టును తిరస్కరించారు. 41 ఏ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ సమయంలో ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు యత్నించారని తెలిపారు. ఇందు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారని అన్నారు. సీబీఐ, ఐడీ కేసుల నుండి కూడా తప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై ముందుగానే పూర్తి వివరాలు తెలియడంతో ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్య.వస్థను ఏర్పాటు చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. అందుకే ఈ కేసులో 41 ఏ సీఆర్పీసి కింద నోటీసులు ఇవ్వలేదనీ, ప్రతి కేసులోనూ 41 ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా ఏజి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేశారు.