(హైదరాబాదు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
దీపావళి పండుగపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు (బాణాసంచా) బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల శ్వాస కోస ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని నిషేదించాలని కోరుతూ న్యాయవాది ఇంద్రప్రకాష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులు బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో తెరిచిన షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న ప్రభుత్వం తెలిపాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో టపాసుల వినియోగంపై నిషేదం విధించడం ఉత్తమమని అభిప్రాయపడిన హైకోర్టు.. ప్రభుత్వం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టపాసులను నిషేదించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. టపాసులను బ్యాన్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నది. కోల్కత్తాలో టపాసులు బ్యాన్ చేయకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి నిషేదిస్తామని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే టపాసుల విక్రయాలను నిషేదించారు.ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు గంటల పాటు మాత్రం టపాసులు కాల్చడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చాయి.