తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల నివాసాల్లో ఇటీవల ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది రూపాయల నగదు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న తమపై మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేసి ల్యాప్ ట్యాప్, ఇతర పత్రాలు లాక్కున్నారనీ ఐటీ అధికారి రత్నాకర్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి.. ఆసుపత్రిలో ఉన్న సోదరుడు మహేందర్ రెడ్డిని బెదిరించి దౌర్జన్యంగా ఐటీ అధికారి రత్నాకర్ సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై వివిధ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసిన బోయినపల్లి పోలీసులు ఈ కేసులను దుందిగల్ పిఎస్ కు బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో ఐటీ అధికారి రత్నాకర్ .. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రత్నాకర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మల్లారెడ్డి మంత్రి కాబట్టి పోలీసులు తనను వేధించే అవకాశం ఉందని, తాను ఐటీ అధికారిగా విధులు నిర్వహించానే తప్ప ఎవరిపైనా ఎలాంటి దౌర్జన్యం చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డే తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేసి దస్త్రాలు లాక్కున్నారని కోర్టుకు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం అధికారికి ప్రాసిక్యూషన్ నుండి రక్షణ ఉంటుందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేందర్ …కేసు విచారణ, రత్నాకర్ అరెస్టుపై నాలుగు వారాలు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ బీజేపీ కీలక నేతకు హైకోర్టులో బిగ్ రిలీఫ్