TRS MLA poaching case: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవేళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ కేసులో బీజేపీ కీలక నేతల ప్రమేయంపై ఊహాగానాలు వస్తుండటం, అధికార బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ల పై విచారించిన హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిసాయి. ఇటు ప్రభుత్వం, అటు పిటిషన్ల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ నేతలు కోరుతుండగా, ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం (సిట్) చేత దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. కేసు విచారణ ప్రాధమిక దశలోనే ఉంది కాబట్టి సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసులో వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. దీనిపై ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.
కాగా..ఇదే కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ ను విచారణ జరిపేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు అనుమతి తీసుకుంది.చంచల్ గుడ జైలులో ఉన్న నందకుమార్ ను నేడు, రేపు రెండు రోజుల పాటు ఈడీ విచారణ చేయనున్నది. ఇటీవలే ఈ కేసులో ఫిర్యాదుదారుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసు ఈడీకి సంబంధం లేకపోయినా విచారణ చేస్తున్నదంటూ రోహిత్ రెడ్డి రీసెంట్ గా సంచలన కామెంట్స్ చేశారు. ఈడీ జోక్యంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కూడా తెలిపారు.