(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల కోసం వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా హెచ్ఆర్సి స్పందించి నోటీసులు జారీ చేసింది. లాక్డౌన్ కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల కోసం వత్తిడి చేయవద్దని ప్రభుత్వ నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కార్పోరేట్ విద్యాసంస్థల యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్నాయని సినీ నటుడు శివ బాలాజీ హెచ్ ఆర్ సిని ఆశ్రయించారు.
శివ బాలాజీ పిటిషన్ను విచారించిన హెచ్ఆర్సి..మానికొండ లోని మౌంట్ లిటేరా జీ స్కూల్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రంగారెడ్డి జిల్లా డీఇఒకు కూడా నోటీసులు జారీ చేస్తూ సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హెచ్ఆర్సి ఆదేశాలు జారీ చేసింది. నటుడు శివ బాలాజీతో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కార్పోరేట్ విద్యాసంస్థల తీరుపై హెచ్ ఆర్ సికి పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
కరోనా లాక్ డౌన్ అమలు అయినప్పటి నుండి విద్యాసంస్థలు తరగతులను నిర్వహించలేదు. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యాలు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు క్లాస్లను భోదిస్తున్నారు. అయితే ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్లను భోధించడం లేదనీ, దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా స్కూల్ యాజమాన్యంను సంప్రదిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా అనేక వర్గాల వారు ఉపాధి అవకాశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నురు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులను గురి చేయవద్దని తెలంగాణ సర్కార్ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొన్ని విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థుల పేరంట్స్కు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో పలువురు విద్యార్థుల పేరెంట్స్ హెచ్ ఆర్ సిని ఆశ్రయించారు.