ఊహకు అందని రీతిలో కరోనా బారిన పడిన మీడియా సంస్థలు విలవిలలాడిపోతున్నాయి. టీవీ పరిస్థితి ఒకలా ఉంటే.. ప్రింట్ మీడియా పరిస్థితి మరింత దారుణంగా మారింది.
వైరస్ భయంతో పేపర్ ను ఇంటికి రానిచ్చేదే లేదని తేల్చి చెప్పేస్తున్న వైనం పత్రికలకు పెద్ద దెబ్బగా మారింది. దారుణంగా పడిపోయిన సర్య్కులేషన్.. పత్రికకు ప్రాణ వాయువును అందించే యాడ్స్ అస్సలు రాకపోవటంతో ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. ఏడాదికి వంద కోట్ల వరకూ ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంటే.. కరోనా టైంలో నాలుగైదు కోట్లు కూడా రాని సంక్షోభ పరిస్థితిని మీడియా సంస్థలు ఎదుర్కొంటున్నాయి.దీంతో.. ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. . . ఇలాంటి సమయంలో వచ్చిన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు మీడియాకు పండుగగా మారింది.
ఇటీవల కాలంలో దినపత్రికలు దాదాపుగా 12 పేజలు.. లేదంటే పద్నాలుగు పేజీల్ని దాటటం లేదు.గతంలో ఇరవైనాలుగు పేజీలకు వెళ్లిన దానికి భిన్నంగా దినపత్రికల్ని బక్కచిక్కిపోయాయి. చాలా రోజుల తర్వాత కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని అధికారపార్టీకి చెందిన నాయకులు.. వారి అభిమానులు.. సానుభూతిపరులు.. వాటికి సంబంధించిన సంస్థలు ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. దీంతో.. చాలా రోజుల తర్వాత పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలతో నిండిపోయాయి.తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ పత్రికగా చెప్పే ఈనాడులో జాకెట్ యాడ్ ఇటీవల కాలంలో లేదనే చెప్పాలి. ఆ కొరతను కేటీఆర్ పుట్టినరోజు తీర్చింది. కేటీఆర్ బర్త్ డేకు సంబంధించి ఈనాడులో రెండు ఫుల్ పేజీ యాడ్స్ రాగా.. సాక్షి మొయిన్ పేపర్లో రెండు పేజీలు.. మినీలో ఒక పేజీ యాడ్ వచ్చింది.
తెలంగాణ అధికారపక్షానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని విమర్శలు ఎదుర్కొనే ఆంధ్రజ్యోతిలో మాత్రం ఏకంగా ఐదు పేజీలకు పైనే ప్రకటనలు రావటం గమనార్హం. ఇక.. టీఆర్ఎస్ పార్టీ సొంత పత్రిక అయిన నమస్తే తెలంగాణలో వచ్చిన అత్యధిక ప్రకటనల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏతావాతా కేటీఆర్ పుట్టిన రోజు ప్రింట్ మీడియా కరువు తీర్చిందనే చెప్పాలి.