గుజరాత్ లో 2002 లో జరిగిన అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే భారత 76 స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం ఈ 11 మంది ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించి విడుదల చేసింది. జైలు నుండి విడుదలైన వారిని పూలదండలతో స్వాగతం పలికి వారికి స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు. అయితే రేపిస్ట్ లకు క్షమాబిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై బీజేపీయేతర పక్షాలు తప్పుబడుతున్నాయి.
ఈ అంశంపై తెలంగాణ మంత్రి కేటిఆర్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే రేపిస్టుల విడుదల చేయడాన్ని కేటిఆర్ తీవ్రంగా ఖండించారు. దోషులను విడుదల చేయడంపైనే తీవ్ర వ్యతిరేకత వస్తుంటే..పైగా వారిని కొందరు పూలమాలలు వేసి ఆహ్వానించడాన్ని చూసి మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రేపిస్టులకు పూలమాలలు వేసి యుద్ద వీరుల్లా, స్వాతంత్య్ర సమరయోధులుగా సత్కరించడం మన దేశంలోనే చెల్లుతుందని సెటైర్ వేశారు. కొందరి తీరుకు ఇది నిదర్శమన్నారు. బిల్కిన్ కి జరిగిన ఘటన మనలో ఎవరికైనా జరగొచ్చని అని అన్నారు. నిందితులకు పూలమాలలు వేయడంపై భారత్ గొంతెత్తి ప్రశ్నించాలని మంత్రి కేటిఆర్ సూచించారు.
రేపిస్ట్ లకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో గుజరాత్ లోని గోద్రా ఎమ్మెల్యే రావూజీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. వాళ్లు నేరానికి పాల్పడ్డారో లేదో తనకు తెలియదు కానీ వారు బ్రాహ్మణులు, మంచి సంస్కార వంతులని అందరికీ తెలిసిందేనని అన్నారు. వాళ్లను ఎవరైనా ఈ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించి ఉండొచ్చని రావూజీ అన్నారు. వాళ్లు జైలులో తమ సత్ప్రవర్తనతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. ఖైదీల విడుదలపై నిర్ణయం తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్ కమిటీలో ఉన్న ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే సీకే రావూజీ కూడా ఒకరు కావడం గమనార్హం.