కరోనా వైరస్ బారిన పడుతున్న రాజకీయ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న విషయం తెల్సిందే.
సామాన్యులతో పాటు రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకుతోంది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కారణంగా రాజకీయ నాయకులకు కరోనా సోకె అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.తెలంగాణలో ఇప్పటికే డెప్యూటీ స్పీకర్, డెప్యూటీ సీఎం, పలువురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో కొందరు కోలుకున్నారు కూడా. ఇక ఇప్పుడు మరో తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి కరోనా సోకినట్లు తెలుస్తోంది.
గత ఆదివారం మల్లారెడ్డికి పరీక్షలు నిర్వహించగా ఈరోజు ఫలితాలలో పాజిటివ్ వచ్చింది. దీంతో మల్లారెడ్డి సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి వైద్యుల పర్యవేక్షణ మేరకు చికిత్స తీసుకుంటున్నారు. మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారికి ఇప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.