తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నాయకులను చేర్చుకునే పనిలో బీజేపీ ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి దాసోజు శ్రావణ్ ను బీజేపీలో చేర్చుకోగా ఈ నెల 21వ తేదీన తెలంగాణకు విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తొంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సీనియర్ నేత రాజయ్య యాదవ్ సహా మరి కొందరు బీజేపీలో చేరనున్నారు. వీరితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు కూడా బీజేపీలో చేరుతున్నారు.
తాజాగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అనుచరుడు, ఘట్ కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర గౌరవాధ్యక్షుడైన ఏనుగు సుదర్శన రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సుదర్శన్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ప్రకటించారు. సుదర్శన్ రెడ్డితో పాటు ఘట్ కేసర్ మండలానికి చెందిన ఇతర నేతలు, వందలాది మంది కార్యకర్తలు త్వరలో చేరుతున్నట్లు తెలిపారు ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్ పీటీసిలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు బీజేపీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు వసూలైన వెంటనే బీజేపీలో చేరతారని చెప్పారు ఈటల రాజేందర్. ప్రజా ప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపిలే అన్నట్లుగా పరిస్థితిని కేసిఆర్ మార్చేశారని ఈటల రాజేందర్ విమర్శించారు. స్థానిక సంస్థలను బలోపేేతం చేస్తామని పేరుకు చెబుతూనే వాస్తవంలో వాటిని నిర్వీర్యం చేశారనీ, దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారన్నారు. ఏ మాత్రం అధికారాలు, నిధులు, గౌరవం లేకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు అవమానాలు ఎదుర్కొంటున్నారని ఈటల రాజేందర్ అన్నారు.
కేసిఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం ..ఇవి కేబినెట్ నిర్ణయాలు