తెలంగాణలో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో.. ప్రత్యేకంగా హైదరాబాద్ లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! సరాసరిని గత కొన్ని రోజులుగా.. రోజుకి వెయ్యి కేసులు దాటిపోతున్నాయి! దీంతో ప్రతిపక్షాలకు ఛాన్స్ వచ్చింది.. చేతికి మైకొచ్చింది.. ఫలితంగా ప్రభుత్వంపై ఫైరవుతున్నారు. కరోనా తీవ్రతకు ప్రభుత్వ అసమర్ధత, అలసత్వాలే కారణమని కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక లాజిక్ తీశారు!
సాధారణంగా… ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేయకపోతే ఆ ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడుతుంది.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది! అంతేకాని.. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా.. సమస్యలపై అలసత్వం ప్రదర్శిస్తే.. ఆ ఎఫెక్ట్ అధికారులపై పడదు!! ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే… తెలంగాణలో కరోనా విషయంలో ప్రభుత్వానికి గతకొన్ని రోజులుగా ఆ పేరు వచ్చిందనే డిస్కషన్ పెరిగిపోయింది. ఈ క్రమంలో కరోనా విషయంలో ప్రభుత్వం విఫలం అయిందంటే.. అది వైద్యులను అవమానించడమే అంటున్నారు శీనివాస్ గౌడ్.
వైద్యులు.. ప్రభుత్వం చెప్పిన మేరకు, అవకాశాలు కల్పించిన మేరకు, సదుపాయాలు సమకూర్చిన మేరకు పనిచేస్తారు! ప్రభుత్వం అవన్నీ కల్పించినా కూడా పనిచేయకపోతే మాత్రం ఆ నేరం వైద్యులది అనుకుంటే… అవన్నీ కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడం కూడా వైద్యుల ఖాతాలో వేసే ఆలోచన శ్రీనివాస్ గౌడ్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ కు మొదట్లో ఉన్న శ్రద్ధ స్థానే అలసత్వం వచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నేడు భాగ్యనగరంలో కరోనా ఈ రేంజ్ లో విస్తరించడానికి.. ప్రజల నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వ అలసత్వం కూడా కారణం అని అంటున్నారు. టెస్టుల విషయంలో కూడా తెలంగాణ సర్కార్ అలసత్వం వహిస్తుందని.. ఏపీలో టెస్టుల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకుపోతుంటే.. తెలంగాణ ఆ విషయంలో బాగా వెనకబడిపోయిందని.. దాని ఫలితమే హైదరాబాద్ లో కరోనా తీవ్రత అని అంటున్నారు.
కానీ.. మంత్రిగారు మాత్రం ఆ లాజిక్ స్థానంలో రివర్స్ లాజిక్ వాడుతున్నారు. కరోనా విషయంలో ఎవరైనా తెలంగాణ సర్కార్ ని కామెంట్ చేస్తే… అది వైద్యులను అవమానించడమే అనేది ఆయన రివర్స్ లాజిక్!! కరోనా పెరిగి కామెంట్స్ పడితే అది వైద్యులను అవమానించడం… నేరాల సంఖ్య పెరిగి ప్రజలు కామెంట్ చేస్తే అది పోలీసులను అవమానించడం… అవినీతి పెరిగితే అధికారులను అవమానించడం… ప్రమాధాలు పెరిగితే డ్రైవర్లను అవమానించడం అని భావిస్తే… మరి ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు?
ప్రభుత్వం చెప్పినట్లే, మంత్రులు సూచించినట్లే అధికారులు పనిచేస్తారు..ఆ సూచనలకు సలహాలు యాడ్ చేస్తారు.. ఆ సూచనల కార్యనిర్వహణ చూస్తారు! తప్ప… అది రివర్స్ లో ఉండదు కదా!! అలా ఉంటే… పథకాలు, ప్రాజెక్టుల పబ్లిసిటీల్లో అధికారుల ఫోటోలు, పేర్లు వేయొచ్చు కదా! ఆ లాజిక్ ని ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలో మంత్రిగారే చెప్పాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!