గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసుల కారణంగా హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారు అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. లాక్ డౌన్ విధించడం వల్ల ఉపయోగం లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే కరోనా ఎదుర్కొనగలమని తలసాని అభిప్రాయపడ్డారు.
కరోనా అనేది వచ్చి పోయేదేనని, మంత్రి మహమూద్ అలీతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉదాహరణలు అని ఆయన తెలిపారు. కేసీఆర్ ఎక్కడంటూ కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తుండడంపై స్పందించి కేసీఆర్ కనపడకపోతేనేం అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయా? నిన్న కూడా ఆయన వ్యవసాయ అధికారులతో మాట్లాడారని తలసాని చెప్పారు. ప్రతిపక్షాలు కరోనా విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మానుకోవాలని తెలిపారు.