కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్న చూపు చూస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని చెబుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా సరిగ్గా విడుదల చేయడం లేదని కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు నిలదీయాలంటూ కేసీఆర్ తన ఎంపీలకు ఎప్పుడూ చెబుతుంటారు.
తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యదవ్.. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆయన మండిపడ్డారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వైఖరి ఇలా ఉండటం కరెక్ట్ కాదన్నారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఓవైపు తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే 24 గంటల కరెంట్ ఇవ్వడం సాధ్యమవుతుందా? కరోనా విపత్తును ఎదుర్కోవడం కోసం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నారు. ఎక్కడ పోయింది ఆ ప్యాకేజ్. ఎవరికి ఇచ్చారు? అంటూ తలసాని బీజేపీపై ఫైర్ అయ్యారు.
మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై కూడా తలసాని మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి.. కరీంనగర్ కు ఏనాడూ పట్టించుకోని బండి సంజయ్.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తారు? అంటూ తలసాని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే మోదీతో కొట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.