Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ కొత్త కొత్త ఆరోపణలు చేస్తోంది.తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇదే పనిలో ఉన్నారు.మూడు రోజుల నుండి శ్రీనివాసగౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తున్నారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.వ్యక్తిగత ఆరోపణలు సైతం చేస్తున్నారు.ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి శ్రీనివాసగౌడ్ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తీవ్ర అభియోగం మోపారు.ఇది రాజకీయంగా వివాదస్పదమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి.
పీజేఆర్ మరణానికి వైఎస్సార్ బాధ్యుడట!
తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం, సీఎల్పీ మాజీ నాయకుడు పి జనార్ధన్ రెడ్డి (పీజేఆర్) అకస్మాత్తుగా గుండె పోటుతో మరణించడం జరిగింది.అయితే ఆయనకు గుండెనొప్పి వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లేనని ఇప్పుడు శ్రీనివాసగౌడ్ వెల్లడించారు.ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ఆంధ్రప్రదేశ్ అధిక వాటా జలాలు తీసుకోవడాన్ని పిజెఆర్ వ్యతిరేకించగా వైఎస్సార్ ఆయనను తీవ్రంగా మందలించి అవమానించారని చెప్పారు.దీంతో పీజేఆర్ కి గుండెనొప్పి వచ్చిందన్నారు.అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి అంబులెన్స్ లో ఉన్న డాక్టర్లు కూడా పిజెఆర్ కి ప్రాధమిక చికిత్స అందించకపోవడంతో సకాలంలో వైద్య సహాయం అందక ఆయన మరణించారని చెప్పారు.ఆ వైద్యులు గనుక చికిత్స చేసి ఉంటే జనార్దన్ రెడ్డి బతికేవారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
మంత్రి ఇంకా ఏం చెప్పారంటే!
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన మావోయిస్టు నేతల్ని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చర్చలకు పిలిపించి చంపించేశారని కూడా మంత్రి ఆరోపించారు.అసలు రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారని మంత్రి అన్నారు.వైఎస్సార్ పాలనలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.తెలంగాణ జలాలు, నిధులు, ఉద్యోగాలను కూడా వైఎస్సార్ మళ్ళించారని ఆయన పేర్కొన్నారు.ఇప్పుడు వైఎస్సార్ కుమారుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కి దౌర్జన్యపూరితంగా మళ్లించుకుంటున్నారని ఆయన చెప్పారు.కేంద్రం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.