తెలంగాణ ప్రభుత్వం గత రెండు రోజుల నుండి కేసీఆర్ ఉన్నత స్థాయి అధికారులతో వరుస భేటీలు జరుపుతూ కరోనా నివారణ చర్యలలో కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ప్రైవేట్ ల్యాబ్ లు అన్నింటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుకునే వెసులుబాటును కలిగించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కు ఎంత రుసుము చెల్లించవలసి ఉంటుంది అన్న దానిపై కూడా స్పష్టత ఇచ్చారు.
తాజాగా విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం తెలంగాణలో ప్రతి ప్రైవేటు ఆసుపత్రి ఒక సారి కరోనా నిర్ధారణ పరీక్ష కోసం 2200 రూపాయలు మాత్రమే వసూలు చేయవలసి ఉంటుంది. అలాగే కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు రోజుకి ఆక్సిజన్ సరఫరా లేకుండా 7500 రూపాయలు మరియు ఆక్సిజన్ సరఫరా తో పాటు అయితే 9 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
లేకపోతే గాంధీ ఆసుపత్రి మరియు తదితర గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మాత్రం కరోనా టెస్టులు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే గత కొద్ది రోజుల నుండి గాంధీ ఆస్పత్రిలో ప్రభుత్వం వారు అందిస్తున్న వైద్యం పై అనేక అనుమానాలు రావడంతో దాదాపు చాలా మంది ప్రజలు ఇక ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు.