BRS to Congress: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పార్టీలో అసంతృప్తి గా ఉన్న నాయకులు ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ రీసెంట్ గా సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారు. తనకు టికెట్ ఇస్తానని కేసిఆర్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారనీ కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్శింహులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా నిరసన దీక్ష కూడా చేసిన మోత్కుపల్లి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవ్వడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల వ్యవహారాలను చూస్తున్న కర్ణాటక డిప్యూటి సీఎం, ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఇవేళ మోత్కుపల్లి బెంగళూరులో కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చిందనీ, అన్ని విషయాలు హైదరాబాద్ లో చెబుతానని ఆయన బెంగళూరులో పేర్కొన్నారు. అలేరు లేదా తుంగతుర్తి నుండి పోటీ చేయాలన్న ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నారు. కానీ బీఆర్ఎస్ లో ఆయనకు ప్రాధాన్యత లభించడం లేదు. పార్టీలో చేరిన కొత్తలో, దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో మోత్కుపల్లికి కేసిఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మోత్కుపల్లి సూచనలు, సలహాలు తీసుకున్నారు కేసిఆర్. అయితే ఆ తర్వాత మోత్కుపల్లిని కేసిఆర్ పట్టించుకోలేదు.
గత ఆరు నెలలుగా కేసిఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడాన్ని మోత్కుపల్లి తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. పార్టీ మార్పు అంశంపై నాలుగు రోజుల క్రితం యాదగిరిగుట్టలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు, తన అనుచరులతో సమావేశం నిర్వహించారు మోత్కుపల్లి. అయితే మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే తుంగతుర్తి టికెట్ దక్కుతుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి మందుల సామేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన అద్దంకి దయాకర్ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సీనియర్ నేత అయిన మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీనే నమ్ముకుని ఉన్న అద్దంకి దయాకర్ పరిస్థితి ఏమిటి.. బీఆర్ఎస్ నుండి చేరిన మందుల సామేలు పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తుంగతుర్తి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
మోత్కుపల్లి రాజకీయ ప్రస్తానం విషయానికి వస్తే ఆయన అయిదు సార్లు వరుసగా ఆలేరు నుండి, ఆ తర్వాత ఒక సారి ఒక సారి తుంగతుర్తి నుండి పోటీ చేసి గెలిచారు. మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2004, 2008 (ఉప ఎన్నిక) అలేరు నుండి, 2014లో మధిర నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. 1983, 1989 లో స్వతంత్ర అభ్యర్ధిగా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు. 1985,1994 లో ఆలేరు నుండి 2009 లో తుంగతుర్తి నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. మధ్యలో 1999లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఆలేరు నుండి గెలిచారు.
1991లో నంద్యాల లోక్ సభ కు జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పీవీ నర్శింహరావుపై పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసన వ్యక్తం చేయడంతో 2018లో టీడీపీ ఆయనను బహిష్కరించింది. 2018 ఎన్నికల్లో బహుజన లెప్ట్ ఫ్రంట్ అభ్యర్ధిగా ఆలేరు నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరిన మోత్కుపల్లి.. ఎస్సీ నేతలకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆరోపించి 2021లో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
CM YS Jagan: జరగబోయేది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని పురుద్ఘాటించిన సీఎం జగన్