(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణ శాసనసభ నేడు నాలుగు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, జీహెచ్ఎంసి చట్ట సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ చట్టానికి అయిదు సవరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ, పది శాతం బడ్జెట్ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ, అధికారుల్లో, ప్రజా ప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ, జీహెచ్ఎంసీ రిజర్వేషన్ రెండు పర్యాయాలు కొనసాగిస్తూ నాల్గవ చట్ట సవరణ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా అయిదవ చట్ట సవరణ చేస్తున్నట్లు కేటిఆర్ ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్గ డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న కారణంగా వారికి సమాన ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కేవలం చట్ట సవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.
ఇదిలా ఉండగా మరో వైపు తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు బీజెపి నేతలను అరెస్టు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా చట్టాలను చేసిందని బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?