హైదరాబాద్ : మిడతల దండు పేరు వింటేనే రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. గంటల వ్యవధిలో వేలాది ఎకరాల్లో పంట పొలాలను మిడతల దండు కబళించే అవకాశం ఉండటంతో రైతుల కంటి మీద కునుకు రాని పరిస్థితి. గత నెలలో మూడు విడతలుగా మిడతల దండు దేశంలోకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అవి అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి పంటలకు తీవ్ర నష్టం కలిగించవచ్చని అంచనా వేశారు. అయితే అవి రాష్ట్రం వైపు రాకుండా దిశ మార్చుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, తాజాగా రాష్ర్టానికి 200 కిలో మీటర్ల దూరంలో మహారాష్ట్రలోని రాంటెక్కు సమీపంలో అజ్ని గ్రామం వద్ద మిడతల దండు ఉన్నదని సమాచారం. దాని ప్రయాణం దక్షిణం వైపు సాగితే, తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దండు దాడి నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. మిడతల దండు నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 20 నుంచి జూలై 5 వ తేదీ వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని, ఆ సమయంలో మొలకెత్తే దశలో ఉండే వానకాలం పంటకు మిడతల దండు దాడితో తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కెసిఆర్.
ప్రధానంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఆ రాష్ర్టాలకు సరిహద్దులో గల ఎనిమిది జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి సంబందించిన చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.