child stories : ప్రతీ స్త్రీ లో:
శివాజీ మహారాజ్ మహానుభావుడు అన్నసంగతి నేటి తరం వారు తెలుసుకోవడం చాలా అవసరం. ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు చేసారు . ఒకటి గోవులను రక్షించారు. గోవధ హద్దులు లేకుండా జరుగుతున్న రోజుల్లో, గోవులను రక్షించడాన్ని తన జీవిత కర్తవ్యంగా పెట్టుకుని గోవులను కాపాడారు శివాజీ. ఇక రెండవ సేవ స్త్రీలను రక్షించి, వారికి నమస్కరించటం గా చెప్పబడింది. ఆయన శత్రువులు అయినటువంటి వారు వివాహం అయిన స్త్రీలను కూడా తీసుకెళ్ళి మానభంగం చేస్తుంటే, వారిని కాపాడి కనపడిన ప్రతీ స్త్రీ లో అమ్మవారి ని చూసి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి, నమస్కరించినటువంటి గొప్ప ఘనత శివాజిదే.
child stories : స్త్రీలు తన చేత చిక్కితే:
యుధ్ధములో తన శత్రువులు అయిన పరమతానికి చెందిన స్త్రీలు తన చేత చిక్కితే , ఖైదీలుగా చేసి బంధించకుండా, వాళ్ళు పెట్టుకోనివే అయినా ఐదోతనపు చిహ్నాలుగా పసుపు, కుంకుమ ,చీరా, ఇచ్చి వారిని తన తల్లిగా భావించి, నమస్కరించి పల్లకీలో తెరలు వేసి మరి వెనక్కి పంపించినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వాడు శివాజీ మహారాజ్. ఆయన నిజంగా మహానుభావుడు.సమర్థ రామదాసు గారు ఆయన గురువు.శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసమని కోటలు నిర్మించి, హైందవ సామ్రాజ్య ఏర్పాటు కార్యసిధ్ధి కొరకు అమ్మవారి అండ కావలసివచ్చింది. అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి శివాజీ అమ్మవారి అనుగ్రహం కోసం ధ్యానమగ్నులయ్యారు. అది చుసిన మంత్రులు, సేనాధిపతులు “ఇదేమిటి, శివాజీ మహారాజ్ ఇంత ప్రౌఢమైన వయస్సులో,అది ఇంత యుధ్ధ సమయములో అంత అకస్మాత్తుగా వెళ్లి ధ్యానం లో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేద”ని కంగారు పడిపోయేవారు.
అమ్మవారు ఇచ్చిన ఖడ్గాన్ని:
ఆ భ్రమరాంబికా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ శివాజీ మహారాజ్ కూర్చుంటే, సాక్షాత్తు ఆ అమ్మవారు ప్రత్యక్షమై, నీకు ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను.. ఇది నువ్వు పట్టుకున్నంత కాలం యుధ్ధంలో నీకు ఎదురు అనేది ఉండదు . ఈ ఖడ్గాన్ని తీసుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించ మని ఆదేశించింది. ఆ భవానీ అమ్మవారు ఇచ్చిన ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలో , ఎడమ పక్కగా వెడుతూ దర్శనం కోసం కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లుఎక్కితే వీర శైవ మఠం అని కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారాలు చూడవచ్చు. అక్కడే కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే, శివాజీ మోకాలు మీద కూర్చుంటే శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారు ఆయనికి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పము మనకు కనిపిస్తుంది.కాబట్టి పిల్లలకు ఎక్కువగా ఇలాంటి కథలు చెప్పండి వారి జీవితం ఉద్దరించ బడుతుంది.