అమరావతి : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలేసే ముహూర్తం ఖరారైందట. ఈ నెల 9 వ తేదీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అపాయింట్మెంట్ లభించినట్లు సినీ వర్గాల్లో టాక్. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, స్టూడియా, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి ఇద్దరు ఇద్దరు చొప్పున, అలాగే ఫెడరేషన్, మా, డైరక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి వంతున సీఎం జగన్ ను కలుస్తారుట. ఈ మేరకు ఓ జాబితాను తయారు చేశారని సమాచారం. అయితే ఈ జాబితాలో బాలయ్య పేరు ఉందా లేదా అన్నది తెలియరాలేదు. నిజానికి బాలయ్య సినీ నటుడే కాక ఆంధ్రలో ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఎమ్మెల్యే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం యాక్టివ్ రోల్ పోషిస్తున్న చిరు, నాగ్ తో పాటు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, మా తరపున నరేష్, జీవిత లు జగన్ ను కలిసే వారిలో ఉన్నట్లు బోగట్టా.
అయితే వీరంతా ఎందుకు సీఎం జగన్ ను కలిసేందుకు ఆంధ్రకు వస్తున్నారు అనేది ఇంకా బయటకు వెల్లడి కాలేదు. సిఎన్ జగన్ మాత్రం సినీ పరిశ్రమ అభివృద్ధి కి సంభంధించి పక్కా ప్రణాళికతో తన వద్దకు రావాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కరోనా నేపధ్యంలో షూటింగ్ లు, అనుమతులు తదితర విషయంపై ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ తో వీరు భేటీ అయ్యారు. అయితే ఆ సమస్యలు ఇక్కడ అప్రస్తుతం. కానీ నాటి సమావేశానికి బాలయ్య కు పిలుపు లేకపోవడం, దానిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ తరువాత విమర్శల పరంపర తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపి సిఎం వైఎస్ జగన్ వద్దకు ఎవరెవరిని తీసుకొని వస్తున్నారు? ఎవరెవరిని వదిలేస్తున్నారు అనేది సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే ప్రధానంగా ఆంధ్రలో సినిమా రంగ అభివృద్ధి గురించే ఇక్కడి సిఎంతో చర్చించే అవకాశం ఉందనేది టాక్.