Rohini Sindhuri: కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక మహిళా ఐఏఎస్ ఏకంగా తన పదవికి రాజీనామాను ప్రకటించడం సంచలనం రేపుతోంది.దేశ చరిత్రలోనే అసాధారణమైన పరిణామమని ఐఏఎస్ వర్గాలు చెప్తున్నాయి.
అసలేం జరిగింది?
మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు.విధి నిర్వహణలో మహా కచ్చితంగా ఉంటారని మంత్రుల్నే లెక్కచేయరని రోహిణి సింధూరికి ఇమేజ్ ఉంది.హాసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ గా వుండగా ఆమెకి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంజుకు మధ్య వార్ జరిగింది.ఆ జిల్లాలో సాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను రోహిణి సింధూరి ఉక్కుపాదంతో అణిచేయడ౦ రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా తయారైంది.రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్న రోహిణికి చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించని పరిస్థితుల్లో మంత్రి మంజు నాయకత్వంలో పలువురు రాజకీయ ప్రముఖులు అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మొరపెట్టుకొని ఆమెను హసన్ నుండి ట్రాన్సఫర్ చేయించారు.అయితే మొండి ఘట్టమైన రోహిణి సింధూరి హైకోర్టు ఏపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కు వెళ్లి హసన్ లోనే కొనసాగే విధంగా ఆర్డర్లు తెచ్చుకుంది.తదుపరి పరిణామాల్లో ఆమె మైసూరుకు బదిలీ అయ్యారు.ప్రజల్లో అయితే ఆమెకు మంచి ఇమేజ్ ఉంది.
రోహిణి సింధూరి వర్సెస్ శిల్పా నాగ్!
అయితే మైసూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శిల్పా నాగ్ అనే మరో మరో ఐఏఎస్ అధికారిణి తనను రోహిణి సింధూరి వేధిస్తున్నారంటూ ,ఈ పరిస్థితుల్లో తాను ఉద్యోగం లో కొనసాగలేనని పేర్కొంటూ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు.మైసూరులో స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఏమాత్రం లేదు.. అందుకే నేను సివిల్ సర్వీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. అని శిల్పా నాగ్ ప్రకటించడం సంచలనం రేపింది.రోహిణి సింధూరి తన విధులకు అడుగడుగునా అడ్డు తగులుతూ అనేక విధాలుగా వేధిస్తున్నారని శిల్పా నాగ్ ఆరోపించారు. అందుకే ఇక ఉద్యోగం కూడా చెయ్యలేక ఉన్నానని ఆమె తెలిపారు తన రాజీనామా పత్రాన్ని కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి పంపుతున్నట్టు ఆమె చెప్పారు.
పన్నెండు కోట్లకు లెక్క అడిగినందునేనా?
కాగా శిల్పా నాగ్ ఆరోపణలను రోహిణి సింధూరి ఖండించారు.మైసూరు కార్పోరేషన్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖాతా కింద పన్నెండు కోట్ల రూపాయలు ఉండగా వాటిని ఏం చేశారని తాను శిల్పా నాగ్ ను అడిగినట్లు వెల్లడించారు.ఆ మొత్తం కనుక ఉంటే కరోనా టైంలో కొన్ని సహాయక చర్యలు చేపట్టాలన్నది తన ఉద్దేశమన్నారు.అయితే శిల్పా నాగ్ ఆ లెక్కలేవీ తనకు చెప్పలేదని,పైగా తనపైనే నిందవేసి అమె రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారన్నారు.ఈ విషయాలన్నింటినీ ప్రధాన కార్యదర్శి రవికుమార్ కు చెప్పానని ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని రోహిణి సింధూరి తెలిపారు.ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతున్న సంగతి పక్కనబెడితే ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య ఈ స్థాయిలో ఘర్షణ జరగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు.