మంచిర్యాల: సహచర తాత్కాలిక ఉద్యోగినిపై ఓ ప్రబుద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నిన్న రాత్రి బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండా తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్ పథకం ప్రకారం ఒంటరిగా ఉన్న తాత్కాలిక కండక్టర్పై బస్సులోనే అత్యాచారయత్నం చేశాడు.
చెన్నూరు నుండి నిన్న రాత్రి 7.30 గంటలకు మంచిర్యాల వస్తుండగా అటవీ ప్రాంతంలో డ్రైవర్ శ్రీనివాస్ బస్సు ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే ఆ కండక్టర్ పెద్దగా అరవడంతో దగ్గరలో ఉన్న వాళ్ళు బస్సు వద్దకు రావడంతో బస్సును డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళాడు. విషయం తెలిసిన జైపూర్ పోలీసులు బస్సును ఆపి మహిళా కండక్టర్ను రక్షించారు.
శ్రీనివాస్పై అత్యాచారయత్నం అనే కేసు కాకుండా అసభ్యంగా ప్రవర్తించినట్టు కేసు నమోదు చేశారు. మహిళా కండక్టర్ను ఆమె స్వగ్రామానికి పంపించారు. తెలంగాణలో ఆర్టిసి కార్మికులు గత 14 రోజులుగా సమ్మె చేస్తుండటంతో యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంది. కొన్ని చోట్ల ప్రైవేటు బస్సులను, అద్దె బస్సులనూ తీసుకున్నది. అయితే తాత్కాలిక సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. బస్సులు సరిగా నడపక కొందరు, ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ మరి కొందరు వార్తల్లోకి ఎక్కుతుండగా ఈ ప్రభుద్ధుడు ఏకంగా తాత్కాలిక కండక్టర్పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా చూడాలని రవాణా శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ విషయం వెలుగులోకి వచ్చింది.