Ramatheertham: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం బొడికొండపై శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆలయంలోని విగ్రహాలను గతంలో దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆలయ పునః నిర్మాణానికి ప్రభుత్వం రూ.3కోట్లు మంజూరు చేసింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవాదాయ శాఖ అధికారులు హజరైయ్యారు. మండపంతో పాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునీకరిస్తారు. ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కొండ దిగువన ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నారు. కొండపై ఆలయ నిర్మాణం పూర్తి అయిన తరువాత విగ్రహాలను నూతన ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు.
Ramatheertham: శంకుస్థాపన బోర్డు తొలగింపునకు అశోక్ గజపతిరాజు యత్నం
తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని నిర్వహించకూడదన్నారు. శంకుస్థాపన బోర్డును అశోక్ గజపతిరాజు తొలగించే ప్రయత్నం చేయగా వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలికి కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ఇది సర్కర్ కంపెనీకాదని అశోక్ గజపతిరాజు అన్నారు. గుడికి విరాళం ఇస్తే చెక్ నా మొహంపై విసిరికొట్టారని, భక్తుల విరాళాలు తిరస్కరించడానికి వారికి అధికారం ఎవర ఇచ్చారని ప్రశ్నించారు. వీరు చెక్కు వెనక్కు ఇచ్చేయడం వల్ల అది ఆయోధ్య రామాలయంకు పంపించానన్నారు. తమ పూర్వికులు ఈ ఆలయాన్ని నిర్మించారని అన్నారు. ఆలయ విగ్రహాల ధ్వంసంపై తనపైనే అభాండాలు వేస్తున్నారనీ, గుడి ద్వంసం చేసిన దొంగలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
ధర్మకర్త హుందాగా వ్యవహరించాలి
ఆలయ అభివృద్ధిని ధర్మకర్తే అడ్డుకోవడం హేయమైన చర్య అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ..అశోక్ గజపతిరాజుపై ధ్వజమెత్తారు. ఆలయ ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయ అభివృద్ధికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ఆలయ ధర్మకర్తగా ఆయన హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కర్ కంపెనీ అని ఎద్దేవా చేస్తారా అని మంత్రి మండిపడ్డారు. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్ గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు.