ఆఫ్ఘానిస్తాన్ లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన కాబుల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు దాడి చేశారు. గంటల తరబడి జరిగిన దాడిలో విద్యార్థులు తమ తరగతి గదుల్లోనే విగత జీవులుగా పడిపోయారు. కాబుల్ యూనివర్సిటీ పైన జరిగిన దాడి రెండు వారాలలోనే రెండో సంఘటన కావడం, ఆఫ్ఘానిస్తాన్ లో హింస ఏ స్థాయిలో ఉన్నదో తెలియచేస్తుంది.
ఈ దాడిలో 19 మంది మృత్యువాతపడగా, మరో 22 మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. భద్రతా తనిఖీలు పటిష్టంగా ఉన్న విశ్వవిద్యాలయంలో ఆయుధాలను ఉగ్రవాదులు ఎలా పొందారో అనే విషయం స్పష్టంగా తెలియలేదు అని, దర్యాప్తు జరుగుతోందని అరియన్ చెప్పారు. మరణించిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు అని కాబూల్ పోలీసు ప్రతినిధి ఫెర్డాస్ ఫరామెర్జ్ అన్నారు. యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన ఇరానియన్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించేందుకు వస్తున్న అధికారులు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి హమీద్ ఒబైది తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా ఒక ఉగ్రవాది తనను పేల్చుకున్నాడు, మిగతా ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు అని అరియన్ తెలిపారు. దీంతో రంగంలో దిగిన భద్రతా బలగాలు కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి ఉగ్రవాద గ్రూపులు అనేక విద్యా కేంద్రాలపై కొన్నేళ్లుగా దాడి చేశాయి.గత వారం పశ్చిమ కాబూల్లోని ఒక విద్యా కేంద్రంపై ఆత్మాహుతి దాడిలో కనీసం 24 మంది విద్యార్థులు మరణించారు. తాజా మారణహోమాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని నాటో ఖండించింది. ఆఫ్ఘన్ పిల్లలు,యువత సురక్షితంగా పాఠశాలకు వెళ్లడం అవసరం. హింసను ఆపడానికి అన్ని ప్రయత్నాల వెనుక నాటో గట్టిగా నిలుస్తుంది అని నాటో రాయబారి స్టెఫానో పోంటెకోర్వో ట్విట్టర్లో తెలిపారు. ఖతార్లో సెప్టెంబర్లో ప్రారంభమైన తాలిబాన్, ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి వారాల్లో హింస పెరిగింది.