తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రీసెంట్గా నటించిన చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించినా.. ఆ తర్వాత పాజిటివ్ టాక్తో దూసుకెళ్లింది. రష్మిక మందన్న హీరోయిన్గా.. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ 100 కోట్ల మార్క్ ను దాటి భారీ వసూళ్లు రాబడుతోంది. వరుస విజయాలతో దళపతి ఫుల్ ఫామ్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. దాంతో విజయ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ‘ఖైదీ, విక్రమ్, మాస్టర్’ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో కలిసి దళపతి విజయ్ తన తర్వాతి సినిమాను చేయబోతున్నాడు.
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ మూవీ తమిళంతోపాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కుతుండటంతో అభిమానుల చూపు ఈ సినిమాపైనే ఉంది. దళపతి 67 (Thalapathy 67) టైటిల్తో రాబోతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో దళపతి 67 సినిమాకు సంబంధించిన ప్రకటన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే దళపతి 67లోని స్టార్ కాస్ట్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. దాంతో ప్రేక్షకులు చాలా సంతోషపడుతున్నారు.
కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం ‘విక్రమ్’తో లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే దళపతి 67కు సంబంధించిన ఇంట్రడక్షన్ ప్రోమో వీడియో.. 67 సెకన్ల నిడివిని కలిగి ఉంది. ఈ ప్రోమోను లోకేష్ కనగరాజ్.. కమల్ హాసన్కు చూపించారు. ట్రైలర్ చూసిన కమల్ హాసన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే దళపతి 67లో కమల్ హాసన్ కూడా అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ విలన్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. దాంతో దళపతి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. స్టార్ హీరోలు నటించబోతుండటంతో సినిమా భారీ స్థాయిలోనే హిట్ కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే దళపతి 67 సినిమా షూటింగ్ ప్రారంభం కావాలి. కానీ వారసుడు సినిమాను ఓవర్టేక్ చేయడం మేకర్స్ కు ఇష్టం లేకపోవడంతో సినిమా అధికారిక ప్రకటన విడుదల కావడం ఆలస్యమైంది. వారసుడు సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టడంతో.. ప్రస్తుతం దళపతి 67 సినిమాను త్వరలో స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ-2, విక్రమ్-2 సినిమాలు స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.