జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలోని మంత్రులందరికీ భిన్నంగా హోంశాఖ మంత్రి సుచరిత వ్యవహార శైలి ఉంది.మిగిన మంత్రులు రాష్ట్ర స్థాయి వ్యవహారాలకే కాకుండా నియోజకవర్గ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ అక్కడ ప్రజలకందుబాటులో ఉంటున్నారు
అయితే సుచరిత మాత్రం తనను గెలిపించిన పత్తిపాడు నియోజకవర్గానికి రావడమే మానేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ప్రత్తిపాడు నియోజకవర్గం ఉంటుంది. అయితే మంత్రి అయినప్పటినుంచి మేకతోటి సుచరిత గుంటూరు అరండల్ పేట నివాసం నుంచి అడుగు బయటకు పెట్టడం లేదని టాక్. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ ఏడాదిన్నర కాలంలో ఆమె కేవలం రెండు మూడు సార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారంటున్నారు.గత ఏడాది ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరిస్తామంటూ సుచరిత హామీ ఇచ్చారు.
ప్రజలు ఆమెను నమ్మి మంచి మెజార్టీతో గెలిపించారు కూడా . కానీ, ఏడాదిన్నర అయినా.. ఆమె ఇక్కడి సమస్యలపై దృష్టి పెట్టింది లేదు. పైగా.. నియోజకవర్గానికి రావడం కూడా మానేశారని అంటున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలని ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.నిజానికి ప్రత్తిపాడు గ్రామీణ నియోజక వర్గము. అనేక సమస్యలు ఆ నియోజకవర్గంలో తిష్టవేసి ఉన్నాయి.నిమోజకవర్గంలో అనేక గ్రామాల్లో రహదారులు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి. చివరకు నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోనే రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
గుంటూరు రూరల్ మండలంలో చాలా గ్రామాల్లో రహదారులు, మంచినీళ్లు లేవు. హోం మంత్రిగా కూడాఉండడంతో నేరుగా ఆమెను కలిసే అవకాశం కూడా తమకు కలగడం లేదని, నియోజకవర్గానికి ఆమె రావడం లేదని, దీంతో తమ సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక పోతున్నామని ఇక్కడి వారు వాపోతున్నారు.నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో కేవలం స్థానిక నేతలతో మాత్రమే అప్పుడప్పుడు టచ్లో ఉంటోన్న సుచరిత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడమే మానేశారని అంటున్నారు.దీనికి తోడు పత్తిపాడు నియోజకవర్గంలో ఆమెకు సరైన దీటైన ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు.టిడిపి ఆ నియోజకవర్గంలో అనామకంగా తయారయింది.కనీసం ఇంచార్జి కూడా లేని దుస్థితిలో టిడిపి ఉంది.మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యకి పత్తిపాడు బాధ్యతలను చంద్రబాబు అప్పగించినప్పటికీ ఆయన కూడా చురుగ్గా లేరు.
ఇక ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొంది చంద్రబాబు నాయుడు వద్ద మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరిపోయారు.ఆయన కి కూడా నియోజకవర్గంలో పెద్ద సీను లేదనే చెప్పాలి.దీంతో తనకు ఎదురులేదన్న కాన్ఫిడెన్స్ తో హోంమంత్రి నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టు కనిపిస్తోంది.ప్రతిపక్షం లేదనుకుని నియోజకవర్గాన్ని విస్మరిస్తే ప్రజాక్షేత్రంలో ఆమె ప్రతికూలతను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైసీపీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.