గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త అందరినీ కుంగదీస్తే అందులో నుండి కూడా సంచలనం రాజేయడానికి కొందరు సోషల్ మీడియా వీరులు ప్రయత్నం చేశారు.
దీంతో సాక్షాత్తు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా, ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. ఎస్పీ బాలు చనిపోయిన తర్వాత బిల్లుపై వివాదం జరిగిందని అందులో రాసుకొచ్చారు. బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడుప్రభుత్వంను ఆశ్రయించగా ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ,ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారన్నది ఆ సోషల్ మీడియా వార్త సారాంశం.
దీంతో కలత చెందిన ఎస్పీచరణ్ లైవ్ ద్వారా ఆ వార్తలను ఖండించారు.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అబద్ధమని చరణ్ తెలిపారు. త్వరలోనే ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో కలిసి బాలు చికిత్స వివరాలు, బిల్లులు బయటపెడుతామని విలేకరుల సమావేశంలో చెబుతామని చరణ్ క్లారిటీ ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కూడా తన నాన్న బాలు కోసం వైద్య పరికరాలు పంపించి సహకరించిందని చరణ్ తెలిపారు. ఇలాంటి వార్తలు తమ కుటుంబానికి బాలుకు చికిత్స అందించిన డాక్టర్లకు, ఆస్పత్రికి నష్టం చేకూరుస్తాయని.. తప్పుడు ప్రచారం ఆపాలని చరణ్ తెలిపారు. తన తండ్రికి చికిత్సనందించిన ఎంజీఎం ఆస్పత్రిపై విష ప్రచారం చేయడం సరికాదని ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక రాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్ కూడా ఈ వార్తలను ఖండించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులను తాను చెల్లించలేదని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.నిజానికి బాలసుబ్రహ్మణ్యం చికిత్స ఖర్చులు చెల్లించనవసరం లేదని ఎంజీఎం ఆసుపత్రి రెండు వారాల క్రితమే ప్రకటించిందని ఆమె వెల్లడించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తమ కుటుంబానికి సన్నిహితుడైన ఆ ఆసుపత్రి వైద్యులు తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే వారని, తన తండ్రి కూడా ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా విషయాలు తెలుసుకుంటే తెలుసుకుంటుండే వారన్నారు.ఇలాంటి వార్తలను నమ్మవద్దని అలాంటి సోషల్ మీడియా మెసేజ్ లను ఫార్వర్డ్ చేయవద్దని దీపా వెంకట్ కోరారు. ఏదేమైనప్పటికీ భారతదేశానికే గర్వకారణమైన బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం కూడా ఇలాంటి నీచ వార్తలను ప్రచారం చేయటం అందరూ ఖండించాల్సిందే !