తీసిన చాలా సినిమాలు వరుసగా ఫెయిల్ అయి కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టినా ఒక ప్రొడ్యూసర్ సినిమాలు తీయడం మానలేదు. చివరికి రెండు సినిమాలు అతనికి అనూహ్యంగా వందల కోట్ల రూపాయలను వసూలు చేసి పెట్టాయి. దాంతో అతడి నష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోయాయి. అతడే టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. హిందీలో అతను జస్ట్ రూ.25 కోట్లతో నిర్మించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా రూ.340 కోట్లకు మించి కలెక్ట్ చేసింది. ఏ అంచనాలు లేకుండా 2022 మార్చి 11న రిలీజైన ఈ సినిమా అభిషేక్ అగర్వాల్కి కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆయన నిర్మించిన ‘కార్తికేయ-2’ కూడా సర్ ప్రైజింగ్ గా కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్తో కలిసి ప్రొడ్యూస్ చేశాడు అభిషేక్.
కార్తికేయ-2 కాసులు ఘల్ ఘల్
కృష్ణ తత్వం అనే కాన్సెప్ట్ పై వచ్చిన ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ దగ్గర భారీగా డబ్బులను రాబడుతోంది. కేవలం మొదటివారంలోనే పెట్టిన బడ్జెట్కి డబుల్ మనీ తిరిగి వచ్చేసింది. రెండో వారంలోనూ ఈ సినిమా విజయవంతంగా నడుస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. నార్త్లో జస్ట్ 50 షోలతో ప్రారంభమైన ఈ మూవీ ప్రస్తుతం ఏకంగా 3 వేలకు పైగా షోలతో దిగ్విజయంగా నడుస్తోంది. ఇలా చూసుకుంటే రూ.50-100 కోట్లు దాటడం ఈజీ అని అంటున్నారు. అదే జరిగితే అభిషేక్ అగర్వాల్ కేవలం రెండు సినిమాలతోనే రూ.400 కోట్లు సంపాదించినట్లు అవుతుంది.
స్టార్ హీరోలకు దీటుగా అభిషేక్ సినిమా
ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన రక్షా బంధన్ వంటి భారీ సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు హిందీలో కార్తికేయ-2 నెంబర్ వన్ పొజిషన్ లో కలెక్షన్స్ రాబడుతోంది. అయితే అభిషేక్కు మంచి లాభాలు అందించిన ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 మూవీల రెండింట్లోనూ ‘హిందూ మతం గురించి ఉండటం’ గమనార్హం. అతడికి ఈ హిందూ ప్రో పాయింట్ అనేది బాగా కలిసొచ్చింది.