సైబర్ నేరగాళ్ల వలకు ఆ తెలివైన వైసీపీ మహిళా ఎమ్మెల్యే చిక్కలేదు. పైగా వారిని కటకటాల వెనక్కు పంపే చర్యలు చేపట్టారు .దీంతో సైబర్ నేరగాళ్ల కథ అడ్డం తిరిగింది.
సాంకేతికతను చావుతెలివితేటలకు వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు ఇన్నాళ్లు సామాన్యులకు బురిడీ కొట్టే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. ప్రముఖులను టార్గెట్ చేయటం సంచలనంగా మారుతోంది. ఏపీకి చెందిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించబోయిన వైనం తాజాగా వెలుగుచూసింది.ఒక అగంతుకుడు ఆమెకు ఫోన్ చేసి తనను కేంద్ర ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకొని పీఎంఈజీపీ కింద భారీ ఎత్తున రుణం ఇప్పిస్తానని చెప్పారు.
ఈ పథకం కింద రూ.3 కోట్ల మేర రుణం తీసుకోవచ్చని.. యాభై శాతం సబ్సిడీకి అవకాశం ఉందని.. ఈ రోజే చివరి రోజంటూ చెప్పేసి ఊరించేశారు. అంతా అయ్యాక చివర్లో.. ఇంత భారీ మొత్తంలో రుణం పొందాలంటే రూ.3లక్షల మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు.ఇక్కడే ఎమ్మెల్యే ఉష బుర్ర పాదరసంలా పనిచేసింది.తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి.. ఫోన్ చేసి ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు చెప్పేయటం.. చివర్లో రూ.3లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని చెప్పటంతో అనుమానం చెందారు. వెంటనే.. ఆమె పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు.
అతగాడు చెప్పిన పథకం గురించి ఆరా తీశారు. అదంతా మోసమన్న విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకే టోకరా ఇవ్వబోయిన ఆగంతుకుడ్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.మొన్ననే తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కేకేను ఇదే రీతిలో సైబర్ నేరగాళ్లు మోసం చేయబోవడం తెలిసిందే.
మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న మేధావి కే కేశవరావు కూడా వాళ్ల వల లో చిక్కబోయి చివరికి కేటీఆర్ పుణ్యమా అనిచివరి చివరి నిమిషంలో బయటపడ్డారు.ఎంపీలు ఎమ్మెల్యేలనే సైబర్ కేటుగాళ్లు ఇలా బురిడీ కొట్టించాలని చూస్తుంటే సామాన్య మానవుల పరిస్థితేమిటో ఊహించుకోవాలంటేనే భయం వేస్తోంది!