(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అప్పుచేసి పప్పుకూడు సామెత మాదిరిగా పెద్ద ఎత్తున అప్పులు తీసుకువస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తిగినట్లుగానే కాగ్ లెక్కలు బయటపెట్టింది. ఆదాయ వనరులను పరిశీలీంచకుండా, పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా జగన్మోహనరెడ్డి సర్కార్ ముందుకు వెళుతుండటంతో సంవత్సర కాలంలో నిర్ధించుకున్న అప్పును కేవలం అయిదు నెలల కాలంలోనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక బండి అప్పులతోనే సాగుతోందని కాగ్ స్పష్టం చేసింది. ఏడాది మొత్తం మీద సెక్యూరిటీల వేలం, ఇతరత్రా అప్పుల రూపంలో 48,295.58కోట్లు తీసుకుంటామని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న ప్రభుత్వం ఆగస్టు నెలాఖరు నాటికే 47,130.90 కోట్లు రుణాలు తీసేసుకున్నది. కాగ్ విడుదల చేసిన ఖర్చుల వివరాల ప్రకారం ఇప్పటికే 97.59 శాతం మేర ప్రభుత్వం అప్పులను సమీకరించింది. రెవెన్యూ ఆదాయం కన్నా రెవెన్యూ ఖర్చు పెరగడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి అయిదు నెలల్లోనే 38,199.33 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయంలో నియంత్రణ పాటించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. జీతాల చెల్లింపులు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు, రాయితీల రూపంలో ఆగస్టు నెలఖారు నాటికి అంటే అయిదు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం 84,521.60 కోట్లు ఖర్చు చేసింది.