సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు.. రాష్ట్ర రాజకీయాలలోనే పెను మార్పు సంభవించింది.ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు.
ఆయన అల్లుడు నారా చంద్రబాబునాయుడు నాటకీయ ఫక్కీలో ముఖ్యమంత్రి అయిపోయారు. 1995 సెప్టెంబర్ ఒకటో తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఆ రోజు నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తే టిడిపిలో ఆయనే హీరో ఆయనే విలన్ అన్ని ఆయనే అవుతారు. అన్నిటికీ మించి ఆయన వెన్నుపోటు అన్న పదానికి పేటెంట్ దక్కించుకున్నారు.పిల్లలిచ్చిన మామనే పీఠానికి దూరం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఆయన జీవించి ఉన్నప్పుడే కాదు ఆ తదుపరి కూడా ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు అన్న మచ్చ ఎప్పటికీ చెరిగి పోదు!ఎన్టీఆర్ విశేష ప్రజాదరణతో 1994లో అధికారాన్ని దక్కించుకున్నారు.
కానీ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా అధికారాన్ని చెలాయిస్తు న్నారని, ఇలాగైతే పార్టీ, ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతాయనే సాకుతో…మామ అని కూడా చూడకుండా పదవీచ్యుతుడిని చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది.ఇదనేకాదు బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతాను రాగాలు ఆయన డిక్షనరీలో కానరావు.స్వంత సోదరుడు నారా రామ్మూర్తినాయుడుని కూడా ఆయన రాజకీయంగా బలి పెట్టారన్న విమర్శలు తెలిసినవే. పదవి కోసం ఎవరినైనా బలిపెట్టడానికి ఆయన సిద్ధమని చెబుతారు.తనకు అడ్డం వస్తారనుకుంటే కుటుంబ సభ్యులు ఎవరినయినా ఆయన పక్కకు తప్పిస్తారు.తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ,బావ నందమూరి హరికృష్ణ,మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్లు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు.వియ్యంకుడు కాబట్టే ఒక్క బాలకృష్ణ జోలికే చంద్రబాబు వెళ్ళలేదని చెప్పవచ్చు.
ఇది ఆయనలోని విలన్ కోణమైతే 1999 లో వెన్నుపోటు అపవాదును పక్కకు నెట్టి మరీ సొంతంగా టిడిపిని అధికారం లోకి తేవటం అనేది చంద్రబాబు హీరోయిజం. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్లీ పార్టీని బతికించుకునే 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చేలా చేయడం కూడా చంద్రబాబు ఘనతే.ఇందుకు రకరకాల కారణాలు దోహద పడినప్పటికీ అంతిమంగా అధికారం దక్కించుకున్న చంద్రబాబును హీరో అనే చెప్పాలి.అయితే ఐదేళ్ళకే అధికారాన్ని కోల్పోయి 2019 ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లతో అదే చంద్రబాబు జీరో అవ్వటం ఆయన రాజకీయ జీవితంలోనే పరమ చెత్త ఘట్టం!