Ration Door Delivery : ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసే రేషన్ స్కీమ్కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. మార్చి ఇరవై అయిదు నుండి ప్రారంభం కానున్న ఢిల్లీ ప్రభుత్వ డోర్స్టెప్ డెలివరీ ఆఫ్ రేషన్ స్కీమ్ (ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన)ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అంతేగాకుండా జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం పంపిణీ చేసే ఆహార ధాన్యాలను కొత్త పేర్లతో కానీ, పథకాలతో కానీ సరఫరా చేయడానికి రాష్ట్రాలకు అనుమతులు లేవని నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.
కాగా, ముఖ్యమంత్రి ఘర్ ఘర్ రేషన్ యోజన పథకం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయాలని సీఎం కేజ్రీవాల్ స్కీమ్ తీసుకొచ్చారు. మార్చి 25 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ పథకం కింద ప్యాకేజ్ చేసిన గోధుమపిండి, బియ్యం, చక్కెర లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతలో కేంద్రం…కేజ్రీవాల్ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చింది.
Ration Door Delivery : ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా?
రేషన్ డోర్ డెలివరీ స్కీమ్ ని నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంతో అందరి చూపు ఏపీపై పడింది. ఎందుకంటే, ఏపీలో జగన్ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ఇందుకోసం పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల సాయంతో రేషన్ సరుకులను లబ్దిదారులకు నేరుగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. సీఎం జగన్ బొమ్మలతో ప్రత్యేకంగా గుర్తించిన బ్యాగుల్లో బియ్యం ఇస్తున్నారు. అలాగే ప్యాకేజ్ చేసిన చక్కెర, కందిపప్పు ఇస్తున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై న్యాయపోరాటం చేసి మరీ.. రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని కొనసాగించారు సీఎం జగన్. అంటే, ఈ స్కీమ్ ను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది.అయితే జాతీయ ఆహార భద్రతా పథకం కింద తాము రాష్ట్రాలకు రేషన్ ఇస్తున్నామని, అందువల్ల దానిలో ఎలాంటి మార్పులూ చేయరాదని కేంద్రం స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం కేటాయించిన ధాన్యాన్ని మరే ఇతర పథకం ద్వారా పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అనుమతి లేదని నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ రూల్స్ ని గుర్తు చేసిన కేంద్రం..ఢిల్లీ విషయంలో కఠినంగా వ్యవహరించిన కేంద్రం.. మరిప్పుడు ఏపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం కొనసాగుతుందా? లేక కేంద్రం బ్రేకులు వేస్తుందా? అనేది ఇంట్రస్టింగ్ గా మారింది.